రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం "వరలక్ష్మీవ్రతము"

"లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం1 శ్రీ రంగథామేశ్వరీం

దాసీభూత సమస్త దేవ వనితాం1 లోకైక దీపాంకురాం1

శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః 1 బ్రహ్మేంద్ర గంగాధం 1

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్" 2

అంటూ శ్రీ వరలక్ష్మీ వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. వరలక్ష్మీవ్రతం మహిమను పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఒకసారి కైలాస పర్వతమందు పరమేశ్వరునితో పార్వతీదేవి లోకమున స్త్రీలు ఏ వ్రతమాచరిస్తే సర్వసౌభాగ్యం, పుత్రపౌత్రాదులతో సుఖంబుగా ఉంటారో చెప్పమని ప్రార్థిస్తుంది.

అందులకు పరమశివుడు ఎంతగానో సంతసించి ప్రజాహితము కోరి నీవడిగిన సంశయమును తీర్చెదనని వరలక్ష్మీవ్రతము గురించి ఉపదేశించినట్లు గాధలున్నాయి. పూర్వము మగధేశమున చారుమతి అనే మహా పతివ్రతయైన బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె అనుదినము గృహస్థు ధర్మాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ భర్తను, అత్తమామలను సేవిస్తూ ఉండేది.

అట్టి పతివ్రతామతల్లిపై శ్రీవరలక్ష్మీకి అనుగ్రహం లభించింది. ఒకనాడు స్వప్నమందు వరలక్ష్మీదేవి చారుమతికి ప్రత్యక్షమై వచ్చే శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందువచ్చెడి శుక్రవారం నాడు నన్ను పూజించిన యెడల నీవు కోరిన వరంబులిచ్చెదని పలికినది.

ఈ స్వప్న వృత్తాంతమును ముందు భర్తకు, అనంతరం అత్తమామలకు, తర్వాత ఇరుగుపొరుగు వారలకు చారుమతి ఎంతో సంతోషముగా చెబుతుంది. ఆ రోజు నుంచి స్త్రీలందరూ ఆ వరలక్ష్మీదేవి చెప్పిన శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందునచ్చే శుక్రవారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. ఈ క్రమంలో ఆ పుణ్యదినం రానే వచ్చింది.

ఆ రోజు చారుమతి మున్నగు స్త్రీలందరు వారి వారి ఇళ్లను ముత్యాల ముగ్గులతో, పచ్చనితోరణాలతో అలంకరించుకుని, ఒక బ్రాహ్మణోత్తముని ఆహ్వానించి షోడశోపచారములతో ఆ వరలక్ష్మీ దేవిని చారుమతితో కలిసి స్త్రీలందరూ పూజించిరి. నానావిధ భక్ష్య భోజనములను ఆ తల్లికి నివేదన చేసి, ఆ తల్లికి వారంతా ఒక ప్రదక్షణ చేయగానే కాలి అందియెలు ఘల్లు ఘల్లుమని శబ్దము వినిపించసాగెను.

అందరూ వారి వాళ్లను చూచుకోగా, చారుమతితో సహా వారి అందరి కాళ్లకు గజ్జెలు కనిపించినవి. వారంతా వరలక్ష్మీ కటాక్షము పొందారని పరమేశ్వరు పార్వతీదేవితో చెప్పెను. అందుచేత ఈ వ్రతమును ఆచరించిన స్త్రీలకు ఐదోతనము, సౌభాగ్యం, సంతానప్రాప్తి వంటి సర్వశుభములు కలుగుతాయి. అలాగే కన్నెముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరించినట్లైతే వారికి మంచి భవిష్యత్తు లభిస్తుందని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి.